గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆక్సిజన్ వంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబానికి అది ధనప్రదాయినిగా మారి ధన వరదను సృష్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్లతో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. సాంకేతిక నైపుణ్యంతో నిర్మించడం వల్ల ఎల్లంపల్లి ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని, రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందని అన్నారు. నిర్మాణంలో లోపాల వల్లే బ్యారేజీ కుంగిపోయిందని,. మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నింపితే కూలిపోయే ప్రమాదం ఉండగా ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, వేలాది ఎకరాలు నీట మునిగే ప్రమాదముందని పేర్కొన్నారు. కేసీఆర్ లాగా తాము 80 వేల పుస్తకాలు చదవలేదుంటూ పుస్తకాలు చదివి ప్రాజెక్టు నిర్మించడం వల్ల కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లోపై అధికారులు సీఎంకు వివరించారు. అంతకుముందు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గోదావరి నదికి చీర, పసుపు, కుంకుమలు సమర్పించి కొబ్బరికాయ కొట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





