హుజూర్‌నగర్‌లోని ఇండ్ల పనులను వేగవంతం చేయాలి

– మార్చి మొదటి వారంలో సీఎంతో ప్రారంభోత్సవం
-పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల ప్లాట్ల పెండింగ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి ప్రతి బ్లాకు తిరుగుతూ అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, మొక్కలు నాటడం, వైట్‌వాష్ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లుý్లో పనిచేసే వారికి ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాదాయ భూములను మార్కెట్ ధరకు కొనుగోలు చేసి పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో తన పట్టుదల, కృషి, ఆకాంక్షలతో పనులను పున:ప్రారంభించి ప్రాజెక్టును పూర్తిచేసి పేదలకు అందించనున్నామని, దీంతో తన చిరకాల స్వప్నం నెరవేరనున్నదని చెప్పారు. ఒక ఫ్లాట్‌కు రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లు, భూమి ఫ్లాట్‌తో కలిపి రూ.10 లక్షల ఖర్చు అవుతుందని వివరించారు. అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రభుత్వం నుండి రూ.75 కోట్లు మంజూరు చేయించి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే రాత్రి, పగలు కూడా ఎక్కువ పనివారిని పెట్టి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో హుజూర్‌గర్ లోకల్‌లో ఇండ్లు లేని వారికి, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యిమంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. రెండో విడతలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పేదలకు అందిస్తామన్నారు. ఎంపిక ప్రక్రియలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో తహసీల్దార్లు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపిక విషయంలో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పిడి నాగయ్య, ఇతర జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *