ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్ఈలకు పదోన్నతులు, పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఒక్క రోజే 64మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతితోపాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల్లో ఆర్అండ్బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్, పోస్టింగ్ వచ్చిన వారిని ఆదేశించారు. ప్రత్యేక చొరవ తీసుకుని సడలింపులు ఇచ్చి మరీ ప్రమోషన్స్, బదిలీలు చేశారని ఆర్అండ్బి ఇంజనీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నల్గొండ పర్యటన బీజీ షెడ్యూల్ ఉన్నా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే ఈఈల ప్రమోషన్స్, పోస్టింగ్పై అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశారు. కోడ్ వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేసిన ఇంజనీర్లకు మంత్రి తీపి కబురు చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి నాయకత్వంలో రోడ్లు భవనాలు శాఖ బలోపేతానికి కష్టపడతామని ఇంజనీర్లు హామీ ఇచ్చారు. మంత్రి సూచనల మేరకు ప్రజల్లో మన్ననలు పొందేలా పనిచేస్తామంటూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.



