– పోచారం, అరికెపూడిలతో ముగింపు
– దానం, కడియంలకు మరోమారు నోటీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 20: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితి. దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు స్పందించని విషయం తెలిసిందే. దీంతో వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ఇక పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ గురువారంతో ముగిసింది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అవడంతోపాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ క్రమంలో రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డిలను స్పీకర్ విచారించారు. ఇరు వర్గాల వాదనలను విన్నారు. అలాగే మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారించారు. వీరి విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ దిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. విచారణకు హాజరైతే వేటు పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే ఆరేళ్లపాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు దానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





