– స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణా రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన దివంగత సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులు అర్పించారు. మాతృదేవోభవ పితృదేవోభవ, ఆచార్యదేవోభవ తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదేనని అందరికీ మార్గదర్శకులు గురువులు అన్నారు. ఏదేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే ఉంటుందన్నారు. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తాడు సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులే అన్నారు. నేడు ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలను తీర్చిదిద్దిన వారు గురువులేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 26,000 ఉన్నాయి ఇందులో 20లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు పగలు రాత్రి కష్టపడుతున్నారన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమములో అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్స్ చౌదరి, జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుకా దేవి, మండల విద్యాధికారులు, ప్రదాన ఉపాద్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



