– ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బాచుపల్లిలో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కాలేజ్ ఫీ రెన్యువల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 అండ్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి.. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం ప్రశంసనీయం, ఆదర్శనీయం అని కొనియాడారు. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సమాజ సేవేనన్నారు. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి.. అందుకనుగుణంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. గొప్ప విజయాలు అంత సులభంగా రావు. ఓపిక, పట్టుదల, నిరంతర కృషి అవసరం.. ఎన్ని అడ్డంకులొచ్చినా లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకు సాగండి.. తప్పకుండా విజయం సాధిస్తారు అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ట్రస్ట్ ఛైర్మన్, ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




