– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ దుర్మార్గం
– మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి 10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్ సాగర్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం తీరు అంటూ విమర్శలు గుప్పించారు. మంగళవారం కేంద్రమంత్రి డియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే వారిని అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. రంగనాయక్ సాగర్ నుంచి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కాలువ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులు ఎందుకు ప్రారంభించలేదని అడిగారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాల వల్ల రైతులు వరుసగా పంటలు నష్టపోతున్నారని కేంద్రమంత్రి అన్నారు. తక్షణమే పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీ సహా పార్టీ నాయకులను స్టేషన్కు తరలించడం అక్రమమని కేంద్రమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలన్నారు. రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుంచి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కాలువ పనులను పూర్తి చేయాలని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
———————————————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




