– జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
– ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన
– ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు
– ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్డెర్ లేయెన్
న్యూదిల్లీ, జనవరి 26: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్క•తిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సిందూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది విచ్చేశారు. దేశ రాజధాని దిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పరేడ్ భారత సైనిక శక్తి పాటవాన్ని సగర్వంగా చాటిచెప్పింది. ఆపరేషన్ సిందూర్లో వాడిన పలు ఆయుధ వ్యవస్థలను సైనిక దళాలు కర్తవ్యపథ్ వేదికగా అచ్చెరువొందేలా ప్రదర్శించాయి. ఈ కవాతులో తొలిసారిగా బ్యాటిల్ అరే ఫార్మేషన్లో నిర్వహించిన కవాతు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యుద్ధ క్షేత్రంలో సైన్యాల మోహరింపును పోలినట్టు పరేడ్ నిర్వహించడం అతిథులు ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పరేడ్లో త్రివిధ దళాలకు చెందిన 6,050 సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ థీమ్తో సాగిన ఆయుధ ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని జగద్విదితం చేసింది. ఈ వేడుకల సందర్భంగా నాలుగు ఎమ్ఐ-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన, 300 కిలోటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్ అతిథులను ఆకట్టుకున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు ప్రదర్శన కూడా ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచింది. భారత్కు అత్యంత కీలకంగా మారిన ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ప్రదర్శించారు. అపాచీ, ప్రచండ్ హెలికాప్టర్లు, వివిధ యుద్ధ విమానాల గగనతల విన్యాసాలు మెప్పించాయి. డ్రోన్ ప్రదర్శన కూడా పరేడ్లో జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కవాతులో కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైనిక కవాతుతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, కళా ప్రదర్శనలు దేశ సాంస్క•తిక వైవిధ్యతను చాటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 శకటాలు దేశ ఖ్యాతిని ఇనుడింపచేశాయి. ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అతిథులు పరేడ్ను ప్రత్యక్షంగా వీక్షించారు.
భారత్కు ప్రపంచ దేశాల శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి భారత్కు శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఈయూ, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ మొదలైన దేశాల నుంచి సందేశాలు అందాయి. భారత్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఈసందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు.‘భారత్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చైనా, భారత్ ఎప్పటికీ మంచి పొరుగువారిగా,స్నేహితులుగా ఉంటాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సందేశమిచారు. భారత ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్య దేశం యూఎస్ల మధ్య చరిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. రక్షణ, ఇంధనం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్ అమెరికాల మధ్య సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకుతీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాలలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో భారత్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో విలువైన జ్ఞాపకం. భారత్, ఫ్రాన్స్ల బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఫిబ్రవరిలో కలుద్దాం అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సందేశం వెలువరించారు. భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉంది. భారత్-ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. ఐరోపా యూనియన్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ తెలిపారు.
శుభాంశు శుక్లాకు అశోకచక్ర ప్రదానం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అడుగుపెట్టిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించారు. దేశ రాజధాని న్యూదిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో కెప్టెన్ శుభాన్షు శుక్లాకు ఆమె ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు యాక్సియమ్-4 మిషన్ చేపట్టిన సమయంలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అసాధారణ ధైర్యంతో పాటు ఆయన సంకల్పానికి గౌరవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2025 జూన్లో ’యాక్సియమ్-4’ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా అడుగుపెట్టారు. దాదాపు 18 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన కీలక ప్రయోగాలు చేశారు. ఖగోళంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం, మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే అంశాలపై ఆయన వీడియో చిత్రీకరించారు. అలాగే అంతరిక్షంలో మానవ వ్యోమగాముల పరిస్థితిపై సైతం ఆయన అధ్యయనం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారతీయుడిగావ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రికార్డుకెక్కారు. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ’కీర్తి చక్ర’ను అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.









