– ఫుట్బాల్కు సింగరేణి నిధులు వాడారు
– స్కాంలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు
– సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలో పారదర్శకత లేదు
– సోలార్ పవర్ స్కాంను బయటపెట్టాం
– గవర్నర్కు వినతిపత్రం సమర్పించాం
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తమ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం అందరం కలిసి గవర్నర్ కు ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయం వారికి తెలిపాం. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి, పెద్దలు హరీష్ రావు పత్రికా సమావేశం పెట్టి, ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందన్నారు. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తిస్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతా ఉన్నాయన్నారు. కేవలం మాట్లాడటమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసామన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఈ కుంభకోణాన్ని, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో మేము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదన్నారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు సింగరేణితో ఫుట్ బాల్ ఆడుతున్నాడు లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నాడన్నారు.
సింగరేణి నిధులు రూ.10కోట్లు మీరు ఫుట్ బాల్ ఆటకి వినియోగించారు. ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగూ ఫుట్ బాల్ ఆడుతున్నారు.. కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసారన్నారు. ఒక్క స్కామ్ కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయటపెడితే కూడా, ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి అన్న నిబంధన పారదర్శకతకు పాతరవేసి ఎందుకు పెట్టారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అట్లాగే నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే, ఆ రోజున బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్ గా ఆనాడు మేము పిలిచినాం. అందుకే ఆరోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బు ఆదా చేస్తూ ఆరోజు జరిగిన మాట వాస్తవమా కాదా? టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి? నిబంధన అప్పటినుంచి తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు? మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది?
ఒక వైట్ పేపర్ (శ్వేత పత్రం) ప్రచురించండి అని డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు. కొంతమందికే సెలెక్టివ్గా ఎందుకు ఇచ్చారు మీరు మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు.. ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు, ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదన్నారు. నైనీ బొగ్గు గని టెండర్లే కాదు.. అన్ని టెండర్లను పారదర్శకత ఉండాలి. నైనీలో కూడా గతంలో 2021లో, 2022లో రెండుసార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమైంది? సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం. దేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్ నిర్మాణం జరుగుతోంది. కానీ మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లు! రెండున్నర మూడు కోట్లలో అయ్యే పని దేశం మొత్తంలో, ఒక్క రాష్ట్రంలో మాత్రం ఏడు కోట్లు ఎందుకు అవుతున్నది? ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు. అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ , జిలెటిన్ స్టిక్స్, 30 శాతం అదనంగా రేటు పెంచారు. డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ వెనకకు తగ్గలేదు. ఈ అన్ని విషయాలు ఇవాళ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి, కాంట్రాక్టర్లను ఒక రింగు చేసి ఇవాళ ప్రజా ధనాన్ని దోచుకుంటున్న తీరును వివరించామన్నారు. సార్ మీరైనా ఇన్వాల్వ్ కాండి లేదా కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండని గౌరవ గవర్నర్ ను అడిగామన్నారు. సిబిఐ కి ఇస్తారా? సిట్టింగ్ జడ్జికి ఇస్తారా? మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి. కానీ ప్రజా ధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబి గనుల్లో కుంభకోణం.. దీన్ని అడ్డుకోండి అని విన్నపం చేశామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





