జాతీయస్థాయి ఖ‌నిజ క‌మిటీలో సింగ‌రేణికి చోటు

– సంస్థ‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన నీతి ఆయోగ్‌
– ఖ‌నిజ‌రంగంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌కు గుర్తింపు
-మ‌న విధానాలు ఇత‌ర రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కం
– ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి  కీలక ఖనిజ కమిటీలో  సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం ఖ‌నిజ‌రంగంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌కు గుర్తింప‌ని  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఈనెల 19న నీతి ఆయోగ్ ప్రకటించిన జాతీయస్థాయి కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కమిటీలో సింగరేణి సంస్థకు ప్రాధాన్యతనిస్తూ ఆ సంస్థ సీఎండీని సభ్యునిగా పేర్కొంటూ ఆఫీస్ మెమొరాండం విడుదల చేసిన నేపథ్యంలో ఆయ‌న గురువారం ఈ ప్రకటన చేశారు. దేశ అవసరాలకు కీలకమైన కీలక ఖనిజాల అన్వేషణను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని  గుర్తుచేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, రష్యా, ఘనా వంటి దేశాలతో వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నామని, కీలక ఖనిజరంగంలో గల అవకాశాలను అధ్యయనం చేయటానికి ఏజెన్సీలను నియమించామ‌న్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ కూడా సాధించిందన్నారు. సింగరేణి ప్రాంతంలోని గుట్టల్లో,  ఓపెన్ కాస్ట్ గనుల మట్టిలో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్ లో ఉన్న కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను గుర్తించడానికి, వాటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలపై కలిసి పని చేసేందుకు  జాతీయస్థాయి సంస్థలైన ఎన్ఎఫ్ టిడిసి, ఐఎంఎంటీ, జెఎన్ఏఆర్ డిడిసి వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్ర‌ ప్రభుత్వ దిశా నిర్దేశంలో సింగరేణి కీలక ఖనజ రంగంలో అవలంబిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని భట్టి గుర్తుచేశారు. ఇటీవల అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర గనుల శాఖకు రాసిన లేఖలోనూ కీలక ఖనిజాల విషయంలో సింగరేణి మోడల్‌ను స్వీకరించాలని ప్రస్తావించడం మన రాష్ట్ర విధానాలకు జాతీయ స్థాయిలో దక్కుతున్న గుర్తింపుగా భావించవచ్చన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ సింగరేణి విస్తరణ కోసం ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్జీఇఎల్ సంస్థతో కలిసి పని చేయడానికి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజస్థాన్ విద్యుత్ ఉత్పాద‌న్‌ నిగమ్ లిమిటెడ్ తో కలిసి సింగరేణి సంస్థ 2300 మెగావాట్ల థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పాదనకు కుదుర్చుకున్న ఒప్పందానికి బుధవారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయ‌మ‌న్నారు. ఉభయ రాష్ట్రాలకు మేలు చేసే విధంగా, దేశ విద్యుత్ అవసరాలకు తగిన విధంగా సహకరించేందుకు ఈ మెగా ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టామన్నారు.  ఒప్పందంలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ ను ప్రస్తుత మంచిర్యాల సమీపంలో గల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో సింగరేణి – రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్  ఒప్పందానికి అనుమతి ఇచ్చిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో సింగరేణిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.  వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page