– విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు
– కోట్లు గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన ఈడీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్11:గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ స్కామ్కు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని గొర్రెల పంపిణీ కుంభకోణం బాధితులకు నోటీసులు జారీ చేసింది. మొయినుద్దీన్ అండ్ గ్యాంగ్ ఏపీకి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి దాదాపు రూ.2కోట్లు మేర మోసం చేసినట్టు ఈడీ దృష్టికి వచ్చింది. రైతులకు చెల్లించాల్సిన నగదును ప్రభుత్వ అధికారుల సాయంతో బినాలు, సొంత ఖాతాలకు మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. గొర్రెల స్కాంలో మోసపోయా రంటూ ఇప్పటికే ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తులోకి దిగింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు బ్రోకర్లు రెండు కోట్ల రూపాయలు ఎగవేసినట్లు గుర్తించింది ఈడీ.ఈ స్కాంకు సంబంధించి ఏపీలో తీగ లాగితే డొంక కదిలినట్లు తెలుస్తోంది. అధికారులతో బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో ఈ కేసును సీరియస్ గా తీసుకుంది ఈడీ. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారుచేశారని.. కోట్లు కొట్టేశారని ఆరోపిస్తోంది ఏసీబీ. ఈ స్కాం ద్వారా వేలకోట్లు చేతులు మారాయని ఆరోపిస్తోంది ఏసీబీ.ఈ స్కాంకు సంబంధించి పశుసంవర్థక శాఖకు చెందిన సీనియర్ అధికారులను అరెస్ట్ చేయగా.. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీపై కూడా కేసు నమోదయ్యింది. గొర్రెల పంపిణీ స్కీం లబ్ధిదారులు అసలు గొర్రెల వ్యాపారంతో సంబంధం లేనివారు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగలేదని.. కానీ వెయ్యి కోట్ల రూపాయలు మాయం చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ విక్రేతలు, ఫేక్ బిల్లులను మళ్లీ మళ్లీ పేర్కొంటూ డబ్బులు దోచుకున్నట్టు ఆధారాలు గుర్తించారు. ఈడీ సోదాల్లో ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు కిక్బ్యాక్ లకు సంబంధించిన డాక్యుమెంట్లు, నకిలీ చెక్ బుక్లు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





