‘సుప్రీమ్‌’ ‌తదుపరి చీఫ్‌ ‌జస్టిస్‌గా సంజీవ్‌ ‌ఖన్నా

కేంద్రానికి సిఫార్సు చేసిన సిజెఐ డివై చంద్రచూడ్‌
‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌  ‌పదవీకాలం నవంబర్‌ 10‌తో ముగియనుంది. దాంతో తన తరువాత సీజేఐగా జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పేరును ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో చంద్రచూడ్‌ ‌తర్వాత సీనియర్‌ ‌జడ్జిగా ఖన్నా ఉన్నారు. జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ‌ఖన్నా నియమితులు కానున్నారు. నియమితులైతే 2025 మే 13 వరకు జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవిలో ఉంటారు. 2019లో దిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఖన్నా పదోన్నతి పొందారు. నిబంధనల ప్రకారం జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి ప్రధానమంత్రికి పంపిస్తుంది. ప్రధాని మోదీ ఆమోదం తరువాత రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదముద్రతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ఖరారవుతుంది. 2022 నవంబర్‌ 9‌వ తేదీన ఛీఫ్‌ ‌జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ఎక్కువకాలం ఈ పదవిలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు అత్యంత సీనియర్‌ ‌న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు.

ఆ లెక్కన జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌తర్వాత జస్టిస్‌ ‌ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌దిల్లీలో న్యాయవాదిగా 1983లో పేరు నమోదు చేసుకున్నారు. తీస్‌ ‌హజారీ కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తరువాత దిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కంటాక్స్ ‌శాఖకు సీనియర్‌ ‌స్టాండింగ్‌ ‌కౌన్సిల్‌గా సేవలందించారు. దిల్లీ హైకోర్టులో ఎమికస్‌ ‌క్యూరీగా, అడిషనల్‌ ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌గా సేవలు అందించారు. ఆ తరువాత 2005లో దిల్లీ హైకోర్టు అడిషనల్‌ ‌జడ్జిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియామితులయ్యారు. జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా దిల్లీ జ్యుడీషియల్‌ అకాడ ఛైర్మన్‌గా, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.

ఎలక్టోరల్‌ ‌బాండ్స్, ఆర్టికల్‌ 370 ‌తొలగింపు, సెంట్రల్‌ ‌విస్టా ప్రాజెక్ట్ ‌సంబంధిత కేసుల్లో జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పాత్ర కీలకమైంది. కాగా నవంబరు 11న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటిరోజు అంటే నవంబరు 12న జస్టిస్‌ ‌ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ 2022 ‌నవంబరు 9 న జస్టిస్‌ ‌యూయూ లలిత్‌ ‌స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కాలంలో రెండేళ్ల పాటు సీజేగా ఉన్నది చంద్రచూడ్‌ ‌మాత్రమే. అంతేకాదు, జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌తండ్రి జస్టిస్‌ ‌విశ్వనాథ్‌ ‌చంద్రచూడ్‌ ‌సుప్రీంకోర్టు 16 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అత్యధికాలం సీజేఐగా పనిచేసింది కూడా ఆయనే. ఏకంగా 7 సంవత్సరాల 139 రోజుల పాటు పదవీలో కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *