– చట్టవిరుద్ద ఫోన్ ట్యాపింగ్ అని ఎలా ప్రకటిస్తారు
– ఇది పోలీస్ మాన్యువల్కు వ్యతిరేకం అని తెలియదా?
– హరీష్ రావు అభ్యంతరం
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 2: చట్టవిరుద్ద ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిందని నగర పోలీస్ కమిషనర్, ’సిట్’ ఇన్ఛార్జ్ సజ్జనార్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలో ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో ఆయన ఒక పోస్టు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అవునా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయాంచాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుందని పేర్నొన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ‘సిట్’ చీఫ్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా పరిగణించకూడదన్నది స్థిరమైన న్యాయసూత్రమని ఆయన స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమైన డాక్టరిన్ ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నెసెన్స్ చెబుతున్నదని తెలిపారు.
తీర్పు చెప్పే అధికారం పోలీసులకు లేదు
దర్యాప్తు చేయడమే పోలీసుల బాధ్యత తప్ప.. తీర్పు చెప్పే అధికారం వారికి లేదని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అన్నది భారత టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అలాగే పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకనుగుణంగా ఉందో లేదో న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుందని హరీశ్రావు స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ ’సిట్’ విచారణ పూర్తయ్యిందని చేసిన అధికారిక ప్రకటనలోనే అక్రమమం అని తేల్చడం సరికాదన్నారు. సజ్జనార్ వ్యాఖ్యలు దర్యాప్తు ఫలితంపై ముందస్తు అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయని హరీశ్రావు తెలిపారు. ఇది ఆలిండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1968కు విరుద్ధమని అన్నారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి రాజకీయంగా సున్నితమైన అంశంలో ఇలాంటి వ్యాఖ్యలతో దర్యాప్తులో నిష్పక్షపాతంపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. విచారణకు ముందే తప్పు జరిగిందనే భావన కలిగించేలా చేసిన ప్రకటనలు ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. పోలీస్ కమ్యూనికేషన్లను రాజకీయ కథనాలను బలపరిచేందుకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, వృత్తిపరంగా చట్ట పరిధిలోకి లోబడే పనిచేయాలని హరీశ్రావు సూచించారు. రాజ్యాంగ పరిమితులను దర్యాప్తు సంస్థలు విస్మరిస్తే ప్రజాస్వామ్యం నిలవదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను ‘సిట్’ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. పోలీసులకు దర్యాప్తు బాధ్యత మాత్రమే అప్పగించబడిందని, విచారణ దశలో ఏదైనా చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి పోలీసులు న్యాయమూర్తులో లేదా న్యాయనిర్ణేతలో కాదని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





