యాభ‌య్యేళ్ల బంధానికి వీడ్కోలు

– తెలంగాణ విద్యుత్‌ చరిత్రలో భావోద్వేగ ఘట్టం
– నేటితో ఆర్టీఎస్‌లోని మొట్టమొదటి యూనిట్ మూసివేత
– కార్మికుల గురించి పట్టించుకోవాలంటున్న సంఘాలు

     (ప్ర‌జాతంత్ర‌, హైద‌రాబాద్‌)

రాష్ట్ర విద్యుత్‌ చరిత్రలో ఐదు దశాబ్దాలకుపైగా చెరగని ముద్ర వేసిన రామగుండం థర్మల్‌ స్టేషన్‌ (ఆర్‌టీఎస్‌)లోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొట్టమొదటి యూనిట్‌ ఆదివారంతో అధికారికంగా మూతపడిరది. సాంకేతికంగా జీవితకాలం ముగిసిందన్న కారణంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక కార్మికుల్లో, ఉద్యోగుల్లో, వారి కుటుంబ సభ్యుల్లోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా కూడా తీవ్ర భావోద్వేగాన్ని, విచారాన్ని నింపింది. ఎన్నో ఏళ్లపాటు రాష్ట్రానికి వెలుగులు పంచిన ఈ కేంద్రం చరిత్రలో కలిసిపోవడం కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా ఒక బలమైన సెంటిమెంటల్‌ అంశంగా మారింది. దీనిని రామగుండం థర్మల్‌ స్టేషన్‌ విద్యుత్‌ ఉత్పత్తి చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించవచ్చు. ఈ చారిత్రక థర్మల్‌ స్టేషన్‌ను 1971 అక్టోబర్‌లో యూఎస్‌ఏఐడీ సహకారంతో స్థాపించారు. ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన తొలి థర్మల్‌ స్టేషన్లలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. 50 ఏళ్లకు పైగా నిరంతరాయంగా పనిచేసిన ఈ ప్లాంట్‌ తన సుదీర్ఘ జీవిత కాలంలో మొత్తం 18,743.4 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ఇది ఆనాటి రాష్ట్ర అవసరాలను తీర్చడంలో, ముఖ్యంగా విద్యుత్‌ లోటు ఉన్న సమయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ యూనిట్‌ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ ముఖ్యంగా కరువు ప్రభావిత జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అయ్యేది. ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్లాంట్‌ అందించిన సేవలు మరువలేనివి. ఇదొక విద్యుత్‌ కేంద్రంగానే కాక వేలాది కుటుంబాలకు జీవనోపాధిని, స్థానిక ప్రాంతానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించిన ఒక పెద్ద సంస్థగా నిలిచింది.
దీన్ని మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల దశాబ్దాలపాటు ఈ ప్లాంట్‌లో పనిచేసిన ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేసిన ప్రదేశం ఇలా మిగిలిపోవడం చూసి తమ జీవితంలో సగభాగంపైగా అనుబంధం కలిగిన కార్మికులు భారమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నారు. ఉత్పత్తి నిలిచిపోయినా తమ జ్ఞాపకాలు, అనుబంధం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయని వారు భావోద్వేగానికి లోనయ్యారు. పాత ప్లాంట్‌ను మూసివేసినప్పటికీ రామగుండం ప్రాంతంలో ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ పాత యూనిట్‌లో పనిచేసిన వేలాదిమంది కార్మికుల భవిష్యత్తుపై ఇది అనిశ్చితిని తొలగించలేకపోయింది.
కార్మికుల ఆందోళనకు ప్రధాన కారణాలు ఉన్నాయి. కొత్తగా ఆధునిక సాంకేతికతతో నిర్మించే విద్యుత్‌ కేంద్రాల్లో ఆటోమేషన్‌ కారణంగా పాత కేంద్రాల కంటే చాలా తక్కువమంది ఉద్యోగులు అవసరమవుతారు. దీంతో పాత కార్మికుల్లో చాలా మందిని సర్దుబాటు చేయడం కష్టతరం కావచ్చు. అలాగే పాత సాంకేతికతపై పనిచేసిన కార్మికులు కొత్త యూనిట్ల అధునాతన యంత్రాలను ఆపరేట్‌ చేయడానికి అవసరమైన నైపుణ్యాలను వెంటనే అందిపుచ్చుకోవాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సీనియర్‌ ఉద్యోగుల విషయంలో సంస్థలు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించడానికి సంకోచించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త ప్లాంట్లలో పాత కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం లేదా సంబంధిత విద్యుత్‌ సంస్థ నుండి ఇప్పటివరకు ఖచ్చితమైన, అధికారిక హామీ లభించకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఒకవేళ సర్దుబాటు చేయలేని పక్షంలో కార్మికులను సంస్థలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇతర యూనిట్లకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. కార్మికుల భవిష్యత్తుపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనిచ్చి వారిని నూతన కేంద్రాలలో సర్దుబాటు చేయడానికి లేదా సరైన ప్యాకేజీలు అందించడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *