– ఏడుగురు నిందితుల అరెస్ట్
- కారు డ్రైవర్ మధు సూత్రధారిగా గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 13: శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. కారులో వెళుతున్న వ్యాపారిని అడ్డగించి దోచుకున్న కేసులో పోలీసులు వెంటనే దుండుగులను పట్టుకోగలిగారు. దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు అని గుర్తించారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్కు చెప్పాడు. అనంతరం మధు, సాయిబాబాపై దాడి చేసినట్లు నటించి దుండగులు నగదు బ్యాగుతో పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ వికారాబాద్లో తనకు రావాల్సిన రూ.40 లక్షల కోసం డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకొని కారులో తిరుగు ప్రయాణ మయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్-పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు.. తుపాకీ, కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లాక నిందితుల కారు బోల్తాపడటంతో రూ.8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి పట్టుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



