– సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరం అంతటా రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్తో కలిసి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే జూబ్లీ హిల్స్ను మాదాపూర్కు అనుసంధానించే జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్ను, కొండాపూర్ ను గచ్చిబౌలితో అనసంధానించే పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్ను, ఇతర ప్రాంతాలను గురువారం పరిశీలించారు. హెచ్చరిక సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు, సీసీ కెమెరాలు, వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్లు, చెవ్రాన్ బోర్డులు, కాంక్రీట్ అడ్డంకులు, రాత్రిపూట లైటింగ్ కోసం వీధి లైట్ల ఏర్పాట్లు సహా అనేక భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకున్న పటిష్ట చర్యలను చైర్మన్ కు వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జీహెచ్ఎంసీ తీసుకున్న భద్రత చర్యల పట్ల జస్టిస్ సప్రే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోకూడదన్నారు. తరువాత నానక్రామ్గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అధికారులు ఔటర్ రింగ్ రోడ్ పై ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా నిర్వహించబడే ఓఆర్ ఆర్ మీదుగా రోజూ 2.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా పటిష్ట పర్యవేక్షణ, భద్రత, నిఘా చర్యలతోపాటు అనుకోకుండా వాహనదారులు ప్రమాదాలబారిన పడినప్పుడు సత్వర స్పందనకు, అత్యవసర వైద్య చికిత్స కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు వివరించారు. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ విఎస్ఎన్ వి, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి , మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్లతో క్షేత్ర తనిఖీలో ఎస్సీసీఓఆర్ఎస్ ఛైర్మన్ వెంట ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





