రేపు జయంతి
ఆయనను స్మరించుకున్న సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని, అన్ని రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పి.వి.నరసింహారావుకు దక్కుతుందని కొనియాడారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయన్నారు. విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశపెట్టారని, నవోదయ విద్యాలయాలు పీవీ హయాంలోనే ఏర్పాటు చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారన్నారు. పీవీ స్పూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు, ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.





