సబ్‌ స్టేషన్లకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు

– పరిశీలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన
– 2034 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌
– డిమాండ్‌కనుగుణంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలి
– విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17: భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఎస్పీడీసీఎల్‌లో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత నాణ్యమైన కరెంట్‌ను రెప్పపాటు కాలంకూడా అంతరాయం లేకుండా అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది మార్చి 24న 308.45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను సరఫరా చేయగా ఈ ఏడాది మార్చి 18న 335.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసినట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని అన్నారు. గత ఏడాది మార్చి 8న 15,497 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ ఏర్పడగా ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సుమారు 2000 మెగావాట్ల అదనపు డిమాండ్‌ ఏర్పడినప్పటికీ రెప్పపాటు కాలం కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరా చేయగలిగామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడినా ఎక్కడా కోతలు లేకుండా ప్రజలకు నిరంతరం కరెంట్‌ను అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ పీక్‌ డిమాండ్‌ 2024 నుంచి 9.8 శాతం చొప్పున పెరుగుతోందని, 2034 నాటికి ఇది 33,773 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు విశ్లేషించినట్టు తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలు, అంచనాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సబ్‌ స్టేషన్లను నిర్మించాలని, కొత్త సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్న ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించే విషయంపై దృష్టి సారించాలని అధికారులకు సూచన చేశారు. ఇదిలా ఉండగా ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సిటీగా పేరొందిన హైదరాబాద్‌ మహానగరంలో అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రిసిటీ కేబుల్స్‌ నిర్మాణానికి పూర్తిస్థాయిలో డీపీఆర్‌ సిద్ధం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 12.5 మిలియన్‌ యూనిట్ల ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్‌ యూనిట్ల పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, రెన్యూవబుల్‌ ఎనర్జీపై పూర్తిగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌, ట్రాన్స్‌ కో సీఎండీ కృష్ణ భాస్కర్‌, జెన్‌కో సీఎండి హరీష్‌, ఎస్పీడీసీఎల్‌ సిఎండి ముషారఫ్‌ ఫారుకి, ఎన్పీడీసీఎల్‌ సీిఎండి వరుణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *