– త్వరలో 408 నక్షా లేని గ్రామాల్లో రీ సర్వే
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలందించడానికి వీలుగా అవినాభావ సంబంధమున్న రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను జత చేయాలని భూభారతి చట్టంలో పేర్కొన్నామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూభారతి పోర్టల్ సర్వే మ్యాప్ లింక్ చేసేలా సాఫ్ట్వేర్ను అభివృద్ది పరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ అంశంపై ఆయా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ భారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ది చేసే సాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలన్నారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే కొలిక్కి వచ్చినందున మిగిలిన 408 గ్రామాల్లో మరికొద్ది రోజుల్లో రీసర్వే ప్రారంభించబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్ఎ కార్యదర్శి మంధా మకరంద్. ఎన్ఐసి ఎస్ఐఓ ప్రసాద్, విజయ్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





