– రెవెన్యూ,హౌసింగ్. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్:- రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ,హౌసింగ్. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించామని , అదేనెల 17వ తేదీ నుం నిర్వహించామన్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు.
ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులకు నిర్ధేశిత గడువు పెట్టుకొని భూ భారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగిందని, ఈనెల 30 తేదీ నాటికి దాదాపు 60 శాతం భూసమస్యలను పరిష్కరిస్తామని, పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని తెలిపారు. పరిష్కారయోగ్యం కానివి, ఇక పరిష్కారం కావని స్పష్టం చేస్తారు.
రెండవ దశలో 28 మండలాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో కూడా ఈనెల చివరినాటికి వీలైనంతవరకూ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. అయితే ఆన్ లైన్ లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.



