– రాష్ట్రంలో బిఆర్ఎస్, కెసిఆర్ ఇక గత చరిత్రే
– కేసీఆర్వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు
– వరుస ఓటములు ఎదురయినా సిగ్గు రాలేదా?
– నన్నూ..నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా పట్టించుకోలే
– కేసులు పెట్టి జైలుకు తోసినా మిన్నకున్నా
– ఫామ్హౌజ్నే జైలుగా మార్చుకుని ఉంటున్నావని గుర్తుంచుకో
– నీలా పాస్పోర్టు బ్రోకర్ దందా చేసి పైకి రాలేదు
– సొంత చెల్లిని మెడబట్టి గెంటిన కెటిఆర్ నాపై విమర్శలా
– కొడంగల్ సభలో కెసిఆర్పై ఘాటు విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్నగర్,ప్రజాతంత్ర,డిసెంబర్ 24:తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్, ఆయన కుటుంబానికి అధికారం దక్కనివ్వనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శపథం చేశారు. మంత్రిగా, కేంద్రమంత్రిగా, సిఎంగా పదేళ్లు పనిచేసిన కెసిఆర్ నాలుగు మంచి మాటలు చెప్పకుండా తోలు తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నీలాగా తిట్టుడు మొదలు పెడితే తట్టుకోలేవు కెసిఆర్ అంటూ హెచ్చరికలు చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వొచ్చి తోలు తీస్తానంటున్నారు. కేసీఆర్వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మెదలుపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వొదిలిపెట్టా. నేను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారు.. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్ను కేసీఆర్ బందీఖానాగా మార్చుకుని చుట్టూ పోలీసులున్నారు. చర్లపల్లికైనా, చంచల్గూడ జైలుకు పంపినా అదే పరిస్థితి ఉంటుంది కదా. నన్ను గెలకవద్దు.. మర్యాదగా ఉండదని మాట్లాడటం లేదు. నల్లమల నుంచి వొచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత సీఎం అయ్యా అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి వంటి ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడవని విమర్శించారు. స్థిరాస్తి వ్యాపారం దందా చేస్తున్నానని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదేం పాస్పోర్టు బ్రోకర్ వ్యవహారం కాదు. దుబాయ్ పంపుతామని ఎవరినీ మోసం చేయలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాష్ట్రానికి ఆదాయం వొస్తుంది. మరో వైపు.. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పడిపోయిందని కేటీఆర్ చెబుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వారు పోతారని వొదిలేశాం. మైకు ముందుకు రావట్లేదు.. దాక్కున్నానని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత? తండ్రి పేరు చెప్పుకొని బతుకుతున్నావు. ఏపీలో చదువుకున్న కేటీఆర్కు తెలంగాణ గురించి ఏం తెలుసు? మా ఊరికొస్తావా? ఊరికి రావాలా? ఎవరు భయపడుతున్నారో తెలుస్తుంది. గజ్వేల్లో లక్షలాది మంది కార్యకర్తలతో నిరసన చేపడితే పాతాళానికి వెళ్లారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లు అయితే.. 2/3 వంతు మెజార్టీతో 80కి పైగా సీట్లతో మళ్లీ మేమే అధికారంలోకి వొస్తాం. ఒకవేళ 153 సీట్లయితే.. 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో సారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాసి పెట్టుకోండి.. ఇదే నా సవాల్. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డపై నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం… వొచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారమనేది కల. భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ చరిత్ర ఖతమే. పార్టీకి, కు భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్, కేసీఆర్ గతమే.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. గత చరిత్రతో ఒరిగేదే లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చాం. కంటోన్మెంట్లో బండకేసి కొట్టాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. 12,726 పంచాయతీల్లో 8,335 మంది సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు ఓడించినా.. ఇంకా నాదే పైచేయి అంటారా? 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. ఇప్పటికైనా కేసీఆర్ వయసును గౌరవిస్తాం. ఈనెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. రు చెప్పిన అన్ని అంశాలపై చర్చిద్దాం రండి. అసెంబ్లీలో చర్చించకుండా ఫాంహౌస్లో నిద్రపోయి.. ఖాలీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసుకు వొచ్చి ప్రెస్ట్లు పెట్టడం కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు వింటారని కేసీఆర్ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సీఎం, తనను, తన కుటుంబాన్ని గతంలో కేసీఆర్ వేధించారని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన పాపాలే ఆయనను వెంటాడుతున్నాయి. జైల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ఆయనకు తిండి పెట్టడం ఎందుకని నేను ఒక్క కేసు కూడా పెట్టకుండా వొదిలేశాను. కానీ ఇప్పుడు సోయి లేకుండా మాట్లాడుతూ తోలు తీస్తా అని స్థాయి లేని మాటలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిసవాల్ విసురుతూ, ‘రా.. నీ చింతమడకకు రమ్మంటావా లేక కొడంగల్ వొస్తావా? ఎక్కడైనా తేల్చుకుందాం. మటన్ కొట్టు మస్తాన్ దగ్గర పొట్టేలును కోసిన తర్వాత తోలు తీసే పని కేసీఆర్కు ఇమ్మని చెప్పాను. సాయంత్రం వెళ్లేటప్పుడు దావత్ కోసం ముక్కో బొక్కో ఇచ్చి పంపమని సూచించాను. నన్ను గెలికితే నేను మాట్లాడటం మొదలుపెడితే నువ్వు ఉరి వేసుకుని చస్తావు. మల్లన్న సాగర్లో పడి చావాల్సిందే అని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వొస్తుందనే భయంతో సొంత బిడ్డను, అల్లుడిని వెళ్లగొట్టాడని, సొంత చెల్లెలిని పండుగకు కూడా ఇంటికి పిలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ‘పిడకల మూతి బోడిలింగం లాంటి కేటీఆర్, నువ్వు, నీ జాతి అంతా వచ్చినా నేను భయపడను. రాజకీయం ఏంటో చూపిస్తా, రాసి పెట్టుకో‘ అని సవాల్ విసిరారు. సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.