– డ్రామాలతో కాలం గడుపుతున్న సిఎం రేవంత్
- మండిపడ్డ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. తెలంగాణ భవన్లో మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క రోజూ మున్సిపాలిటీల అభివృద్ధి గురించి చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్గా, రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తిగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు తమ నాయకుడు హరీశ్రావుకు సిట్ పేరుతో నోటీసులు ఇచ్చి మొదటి డ్రామాకు తెరలేపారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమైనా ఉందా అంటే మన్ను లేదు మశానం లేదని అన్నారు. దావోస్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విహార యాత్ర చేశాడని, మొత్తం 12 రోజులపాటు వెళ్లిన ముఖ్యమంత్రి దావోస్ నుండి వచ్చిన పెట్టుబడుల గురించి చెప్పలేదని అన్నారు. పెట్టుబడులపై మంత్రి శ్రీధర్బాబు అయినా మాట్లాడతాడనుకుంటే ఆయన కూడా మాట్లాడలేదని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విహార యాత్ర అంటున్నామని విమర్శించారు. తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులిచ్చి రెండో డ్రామాకు తెరలేపారని సంజయ్ మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడంలో రేవంత్ రెడ్డి ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు మున్సిపాలిటీల్లో, మున్సిపల్ ఎన్నికలున్నప్పుడు గ్రామ పంచాయతీలో సభలు నిర్వహిస్తాడని చెప్పారు. ప్రజలను రేవంత్ మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. ఇతర పార్టీలతో అంటకాగేది రేవంత్ రెడ్డి అని, కానీ బీఆర్ఎస్కు బీజేపీకి లింక్ పెడుతున్నారని విమర్శించారు. వీణావాణి గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, తగిన సమయంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని సంజయ్ స్పష్టం చేశారు.
తప్పులు చేస్తూనే ఉన్న రేవంత్
మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ను తిట్టడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదని తెలిపారు. తప్పులు చేస్తే చెప్పండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉన్నాడని పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో నిజాయతీగా ప్రజల సమస్యలపై చర్చ చేయాలన్నారు. ఈ బ్జడెట్ లో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన హామీలకు నిధులు కేటాయించకపోతే వారందరూ కలిసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. బ్జడెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి ఫేవరేట్ స్జబెక్ట్ అయిన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదామని తెలిపారు. సమావేశాలకు వచ్చే ముందు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలుసుంటే బావుంటుందని రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఎట్టకేలకు దేవాదుల ప్రాజెక్టు దగ్గరకు వెళ్లినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని రేవంత్ రెడ్డికి తెలుసునని సంజయ్ అన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాల్సిందేనని తెలిపారు. బ్జడెట్ సమావేశాల్లో తమకు మైక్ ఇవ్వమని చెప్పండి.. జలాలపై చర్చకు సిద్ధమని అన్నారు. ఈసారైనా అసెంబ్లీనీ గౌరవించి ప్రతిపక్ష బీఆర్ఎస్ కి మాట్లాడే అవకాశ మివ్వాలని సూచించారు. పార్టీ మారారని ఆసిఫాబాద్ కౌన్సిలర్పై అనర్హత వేటు వేశారని, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రచారం చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





