– రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావడం కల్ల
– అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి
– ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ లాబీలో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తల్లకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. అసెంబ్లీ నిర్వహణపై కూడా ఆయన విమర్శలు చేశారు. సభను సమయానికి ప్రారంభించడం లేదని, టీ బ్రేక్ పేరుతో గంటలతరబడి వాయిదాలు వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రావడం, మంత్రుల సంసిద్ధత వంటి కారణాలతో సభను తరచుగా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష గొంతును నొక్కుతున్నారని ఆరోపించిన హరీష్, అసెంబ్లీని మరో వారంరోజుల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, రైతులు సహా అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల బీఆర్ఎస్కు మేలు జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక, రాజకీయ నష్టం జరుగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల అంశంపై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాలను నిలబెట్టుకోలేకపోయిందని వ్యాఖ్యనించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, మొత్తం 16 నోటిఫికేషన్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. సంక్షేమ బోర్డుల పరిస్థితిపై కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 33 సంక్షేమ బోర్డులు ఉన్నప్పటికీ, వాటిలో 16కి మాత్రమే కార్యాలయాలు ఉన్నాయని, మిగిలిన 17 బోర్డులకు కార్యాలయాలు కూడా లేవని తెలిపారు. కార్పోరేషన్లకు కేటాయించిన నిధుల్లో 99 శాతం లాప్స్ అవుతున్నాయని, కేవలం 2 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.