– కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీకి పిలుపు
– కేబినెట్లో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ నాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో భాగస్వామి కానున్నారు. 19వ తేదీ ఉదయం దిల్లీకి చేరుకోనున్న వీరు, కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పాలన మొదలై రెండేళ్లు దాటిన క్రమంలో, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. ఈ భేటీ తర్వాత క్యాబినెట్లో ఖాళీల భర్తీతోపాటు పలువురి మంత్రి పదవుల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకునే వీలుందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గ్యారెంటీల అమలు తీరుపై అధిష్టానం సమీక్షించనుంది. అలాగే ఇటీవల వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలపైనా అగ్రనాయకత్వం సంతృప్తితో ఉంది. ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. అలాగే విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాల గురించి రాహుల్ గాంధీ స్వయంగా నాయకులకు సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ అధిష్ఠానం ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే 19వ తేదీ ఉదయం తెలంగాణ నేతలతో సమావేశమై, అదే రోజు సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో భేటీ కానుంది. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు, ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని పెంచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





