- హెచ్ సీయూలో విధ్వంస కాండ కొనసాగిస్తున్నారు..
- తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ సీయూలో విధ్వంస కాండ కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వొస్తుందని, నిరుద్యోగులను గొడ్డును బాదినట్లు బాదుతున్నారని, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. 5వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని అందజేసి, ఆ తర్వాత బోయిన్ గుట్టలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్, సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సభలో హరీశ్ రావు ప్రసంగించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, సేవాలాల్ విగ్రహాలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించినట్లు, కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ 125 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు.
సేవాలాల్ మహారాజ్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఎస్టీల గురించి ఆలోచించలేదు. కేసీఆర్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. బంజారాహిల్స్ లో బంజారాభవన్ కట్టి ఆత్మగౌరవం పెంచారని, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా తండాలో మా రాజ్యం నినాదాన్ని నిజం చేశారని కొనియాడారు. కేసీఆర్ ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్చమైన నీరు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి మాయ చేసింది.
ఏడాదిన్నర రేవంత్ పాలన చూస్తే అంతా సగం సగం ఆగం ఆగం.. ఒక్క పథకం అమలు కాలేదు, ఏది ప్రజలకు అందలేదు.. అసెంబ్లీ బయట అబద్దాలు, అసెంబ్లీలో లోపల అబద్దాలు రేవంత్ రెడ్డి రుణమాఫీ ఏమైందని అడిగితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారు. గండి మైసమ్మ మాత్రం ఆ వోట్ల నుంచి తప్పించుకుంది. పంద్రాగస్టు వరకు అందరికి రుణమాఫీ చేస్తానని, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పాడు. 2 లక్షల పైన ఉన్న వారు సీఎం మాటలు నమ్మి బ్యాంకుల్ల పైసలు కట్టారు. నల్లమల అడవుల నుంచి వొచ్చినోడివి అయితే నీ నిజాయితీ ఏమైంది. పాలమూరు బిడ్డవు అయితే నీ పౌరుషం ఏమైంది. వానాకాలం రైతు బంధు 8 వేలు ఎగ్గొట్టాడు.
యాసంగిలో నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టాడు. ఈ రెండు కలిపి రుణమాఫీకి జమచేసి, రుణమాఫీ అయిపోయిందని అంటున్నాడు. కరోనా వొచ్చినా కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. నెలానెలా పింఛన్ ఆపలేదు. రేవంత్ రెడ్డికి ఏమైంది. కరోనా లేదు, ఇబ్బంది లేదు, రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. చెప్పింది రూ.49 వేల కోట్లు, బడ్జెట్ లో రూ.31వేల కోట్లు అన్నాడు.రూ.14, 15వేలు కోట్లు కూడా లేదు. కేసీఆర్ జిడిపి పెంచితే, రేవంత్ గుండాయిజం పెంచుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే, ఆయన కుటుంబ ఆదాయం పెంచుకుంటున్నడు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగడం కాదు, మీరు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ భూములకు హక్కులు కల్పించాలని రాహుల్ గాంధీని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కేసీఆర్ పేదలుకు ఇచ్చే పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టాడు. ముసలోళ్ల పైసలు రేవంత్ రెడ్డి తింటున్నాడు. దివ్యాంగుల పైసలు తిన్నాడు. 13లక్షల పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కేసీఆర్ సాయం చేశారు. మిషన్ భగీరథితో ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. కేసీఆర్ కిట్టుతోపాటు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి వొచ్చాక బతుకమ్మ చీరలు, పిల్లల స్కాలర్ షిప్పులు బందు చేశారు. దిల్లీలో బీసీ బిల్లు పాస్ చేయిస్తా అన్నాడు. ఆ మీటింగ్ కు రాహుల్ గాంధీ ముఖం చాటేశారు రాహుల్ గాంధీని ఒప్పించని రేవంత్, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే తిట్లు తప్ప ఇంకోటి లేదు. ప్రజలకు పనికి వచ్చే మాటలు లేవు అని అన్నారు. ఎస్టీలకు రేవంత్ వచ్చాక మంత్రి పదవి కూడా దొరకలేదు. ముఖ్యమంత్రి హెచ్ సీయూలో విధ్వంస కాండ కొనసాగిస్తున్నాడని అన్నారు.
అన్నీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. అలాగే గద్దెనెక్కాడు. కేసీఆర్ ఉన్నపుడు మూడు పువ్వులు ఆరు కాయలు లెక్క ఉండేది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైడ్రో పేరుతో పేదల ఇండ్లు కూల్చివేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో భయాందోళనకు గురి చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయ్యింది. తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ అని అన్నారు. తెలంగాణకు దిల్లీలో ఉన్న బిజేపీ మోసం చేసింది, గల్లీలో ఉన్న కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలకు హరీష్ రావు కండువాలు వేసి పార్టీలోకి స్వాగతించారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే