– బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్లోని అన్ని వీసా సర్వీసులను త్వరలోనే పునరుద్ధరిస్తున్నట్టు సీనియర్ ఇండియన్ కాన్సులర్ అధికారి న్యూదిల్లీలో గురువారం ప్రకటించారు. ఈ క్రమంలో వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ పునరుద్ధరించింది. కొద్దికాలం క్రితం భారత వ్యతిరేక యువనేత షరీఫ్ ఒస్మాన్ హదీ హత్యకు గురికావడం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హదీ హత్యానంతరం హిందూ మైనారిటీలపై దాడులు, హత్యాకాండలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. గత డిసెంబర్ నుంచి భారత్-బంగ్లా మధ్య వీసా సర్వీసులు నిలిచిపోయాయి. అయితే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తప్పుకోవడం, ప్రజాస్వామ్యబద్ధంగా తారిఖ్ రెహ్మాన్ ఎన్నికకావడంతో భారత్-బంగ్లా మధ్య సంబంధాల పునరుద్ధరణకు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


