– పాలమూరు-రంగారెడ్డికి విభజన చట్టంలో ప్రతిపాదన ఏదీ?
– పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తోడితే కేసీఆర్ ఏం చేశారు?
-కే సీఆర్ 229 టిఎంసిలు చాలని సంతకం పెట్టలేదా?
- జగన్తో కలసి ఏం మాట్లాడారో బయటపెట్టాలి
– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 8: కృష్ణా జలాల విషయంలో ప్రజలను కేసీఆర్ పదేపదే మోసం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఆయన ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. కరీంనగర్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించినప్పుడు ఎవరూ స్పందించలేదన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకోలేదు. అవసరం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదు. అప్పటికే నిర్మాణంలో ఉన్నవాటికి అభ్యంతరం చెప్పొద్దని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. ఆ చట్టంలో పాలమూరు-రంగారెడ్డి ఊసే లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని ఏపీకి తరలించారు. దీన్ని గతంలో అడ్డుకోలేదు. కాంగ్రెస్, కేసీఆర్ చేసిన మోసాలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్లో గోదావరి, కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇరిగేషన్ విషయంలో అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. మేము నదీజలాలపై కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లో లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తామే ప్రారంభించామని కాంగ్రెస్ అంటోంది.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇది మరణశాసనం. వాళ్లే జాతీయ హోదా ఇవ్వలేదని లొల్లి చేస్తూన్నారన్నారు. రీ ఆర్గనైజ్ యాక్ట్ లో 6 ప్రాజెక్ట్ లు మాత్రమే ఉన్నాయి.. పునర్విభజన చట్టంలో లేని పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎలా ఇస్తారు..? అని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఆ రెండు పార్టీలు నోరు మెదపలేదు. కేసీఆర్ ప్రకటనలకు పరిమితం అయ్యారని బండి సంజయ్ అన్నారు.. కృష్ణా నది జాగీరా? అణు బాంబు అయితా అన్నాడు కేసీఆర్.. అణుబాంబు కాదు తోక పటాక్ కూడా కాలేదని ఎద్దేవా చేశారు. ఉమాభారతి సమక్షంలో జరిగిన మీటింగ్ లో 299 టిఎంసిలు కృష్ణా నదిలో వాటా చాలు అన్నారు. దానికి కేసీఆర్ వద్ద సమాచారం లేదు. తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం చేసింది కేసీఆర్. ఈ విషయాన్ని నేనే బయట పెట్టాను.. వెంటనే నేను అన్నది తప్పు అన్నారు కేసీఆర్. ఆంధ్ర వాళ్ళతో కమిట్ అయ్యి.. ఇక్కడ ఉల్టా డైలాగులు కొట్టారు. కాళేశ్వరం అని రూ. లక్ష కోట్లు మింగి కూలేశ్వరం కట్టారు. రెండవ దఫాలో కృష్ణా ద కన్నేసి.. పాలమూరు రంగారెడ్డి కి సిద్ధమయ్యారన్నారు. ఇరవై ఏడువేల కోట్లు పెడితే చుక్క నీరు రాలేదు. లిప్ట్లు రిజర్వాయర్ల కోసం రూ. 80 వేల కోట్లు అని.. ఓ అంచనా లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఖర్చు అయి ఉంటాయి అన్నారు. కృష్ణా జలాల విషయంలో 2016, 2020 లో రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ టింగ్ జరిగింది. మొదటిసారి మిస్టేక్ అనుకుందాం? రెండోసారి మీటింగ్ 2020 లో జరిగింది?.అప్పుడైనా సరిదిద్దుకోవాలి కదా.. ఆ మీటింగ్ లో కూడా 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు.. జగన్ ప్రగతి భవన్ కి వచ్చారు.. ఇద్దరూ కలిసిన విషయం ఫార్మాలిటీ అన్నారు.. ఆనాడు నేను ప్రశ్నిస్తే నన్ను విమర్శించారు. వెంటనే బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల జరుగుతుంటే ఆపలేదు. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర చేపల పులుసు తిని వచ్చారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి.. పెద్దన్న పాత్ర పోషిస్తా అన్నారు. కవిత కూడా ఆ రోజు పట్టుబట్టలు పెట్టారు. ఆరోజు జరిగిన సమావేశంలో ఏమి జరిగిందో కవిత బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. బీజేపీ అండ ఉంది. కవిత దావత్ వద్దన్నదని నాకు సమాచారం ఉంది. ఇప్పుడు చెప్పాలి? రోజా ఇంట్లో నాన్ వెజ్ తిని తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో అన్యాయాన్ని నిరసిస్తూ మేము ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేశామని గుర్తుచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





