– తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు
– పరిహారం కోసం ఎవరూ ఎదురుచూడొద్దు
– చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలి
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన నష్టం, ఇప్పటివరకు తీసుకున్న సహాయక చర్యలపై ఆయా శాఖల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి సుల్తానియాతో కలిసి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలావరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. సహాయక పనులను మరింత వేగవంతం చేయాలని, ఇప్పటివరకు పరిహారాలను విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క బాధితుడూ పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సహాయక చర్యలను ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని హైదరాబాద్ నుంచి ఆయా విభాగాధిపతులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వరద సహాయానికి సంబంధించి వినియోగించిన నిధులకు యూసీలను కేంద్రానికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 13లోగా ఆయా విభాగాలు యూసీలను సమర్పించాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా వచ్చే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, హెల్త్, మున్సిపల్, ఆర్అండ్బి, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష
నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక, సీపీఆర్వో జి.మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు సమావేశంలో ప్రధానంగా అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హైపవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్ధిక శాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.