– హరీష్, రేవంత్ మధ్య ఉన్న బంధం చెప్పాలి
– మరోమారు విమర్శలు గుప్పించిన కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: కేవలం సిద్దిపేటకే నిధులు విడుదలలో ఆంతర్యం ఏమిటని, హరీష్ రావు, సిఎం రేవంత్ మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్ బూతుల వర్షం ఆగిపోవడం సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూశాక పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మంచినీరు, పారిశుధ్యం లోపిస్తోందని, ఈ అంశాలపై ఎన్నికల ప్రచారంలో చర్చ జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కేవలం సిద్ధిపేట మున్సిపాలిటీకి మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని.. హరీష్ రావు, ముఖ్యమంత్రికి మధ్య ఏముందో అర్థం చేసుకోవాలని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించకుండా.. ఆస్తులను అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బడ్జెట్లో అన్ని వర్గాలకూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదని వెల్లడించారు. రుణమాఫీపై చర్చకు తాము సిద్ధమని.. సచివాలయాలనికి రమ్మంటారా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు రమ్మంటారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు జాగృతి తరపున వినతి పత్రం అందిస్తామని కవిత తెలిపారు. లేబర్ కోడ్కు వ్యతిరేకంగా 12వ తేదీన బంద్కు జాగృతి మద్దతు ఇస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీ పొద్దు తిరుగుడు పువ్వులా.. ఎవరు అధికారంలో ఉంటే వారి వెంట ఉంటుందని సెటైర్లు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయల తెలంగాణకు ఒవైసీ బ్రదర్స్ మద్దతు ఇచ్చారని, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అన్న ఒవైసీ.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేశారని కవిత విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.