గణనీయంగా తగ్గిన సీజనల్‌ వ్యాధులు

– గతేడాది కంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు తక్కువ
– సీజనల్‌ వ్యాధులపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: గత రెండేండ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర నాయక్‌లు ఈమేరకు వెల్లడిరచారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు చికున్‌గున్యా కేసులు 361 నమోదవగా ఈ ఏడాది జనవర్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. గతేడాది టైఫాయిడ్‌ కేసులు 10,149 నమోదవగా ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయంటూ అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండడం అభినందనీయమన్నారు. మొత్తంగా చూసినప్పుడు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటి లార్వల్‌ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, ఆయా జిల్లాల్లోని హాస్పిటళ్లలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. వాతావరణంలో మార్పులు, ఆ మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు పడుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలన్నారు. ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, ఒకవేళ సీజనల్‌ వ్యాధుల బారినపడితే ప్రభుత్వ దవాఖానల వైద్య సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *