– కుటుంబం ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: అంబర్పేట్లో కుటుంబం ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామ్రాజ్తో పాటు అతడి భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి మీడియాకు తెలియజేశారు. అధిక వడ్డీతో హ్యాండ్ లోన్ తీసుకుని తిరిగి ఇచ్చే వ్యవహారంలో వేధింపులకు గురిచేసిన కారణంగానే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ’మృతుడు రామ్రాజ్.. మల్లాపూర్, చక్రిపురం ప్రాంతంలో కింగ్స్ బిర్యానీ హోటల్ను నిర్వహిస్తున్నారు. నిర్వహణ కోసం పలువురి నుంచి సుమారు రూ.57 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో నిందితులు అధిక వడ్డీ తీసుకుని బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఒరిజినల్ భూమి డాక్యుమెంట్లు తీసుకుని తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆత్మహత్య చేసుకునే రోజు కూడా వేధింపులు కొనసాగించడంతో మనస్తాపంతో రామ్రాజ్ తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె అమూల్య ఫిర్యాదు మేరకు అంబర్పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు అని డీసీపీ వెల్లడించారు. మృతుడి సూసైడ్ నోట్లో నలుగురు నిందితుల పేర్లు ప్రస్తావించడంతో పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారన్నారు. నిందితులు మహమ్మద్ వాసి, రాజశేఖర్ రెడ్డి, మహమ్మద్ నవాజ్, సయ్యద్ మాజీద్లను పట్టుకున్నట్లు తెలిపారు. హ్యాండ్ లోన్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రక్షిత మూర్తి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.