•చాలాకాలం తర్వాత 0.25 శాతం మేర తగ్గింపు
•ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయం
•వివరాలు వెల్లడించన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబై, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చి ంది. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటును తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా కొవిడ్ పరిణామాలతో 2020 మే నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించింది. ఆ తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచే పక్రియను ప్రారంభించింది.
అనంతరం 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చిన కేంద్ర బ్యాంకు.. తాజాగా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి పరపతి విధాన సక్ష ఇది. ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు ఇలావున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4శాతం ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7శాతం, రెండో తైమ్రాసికంలో 7శాతం, మూడో క్వార్టర్లో 6.5శాతం, నాలుగో తైమ్రాసికంలో 6.5శాతం ఉండొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8శాతంగా ఉండొచ్చు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు. 2025-26లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.2శాతంగా నమోదవ్వొచ్చు. కమర్షియల్ బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంది. బ్యాంకుల వద్ద సరిపడా ద్రవ్య లభ్యత ఉంది.





