– కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పున పరిహారం
– నగరంలో అనేక చోట్ల ఇలాంటి కబ్జాల వల్లనే ప్రమాదాలు
– మాగం బస్తీలో రంగనాథ్, కలెక్టర్ హరిచందన పర్యటన
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబరు 15: భారీ వర్షం నేపథ్యంలో ఆదివారం రాత్రి అప్జల్సాగర్లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాల కబ్జా వల్లే వరద సమయంలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నిర్మాణం కారణంగా నాలాల్లో వరద నీరు అడ్డుపడింది. అప్జల్ సాగర్ వద్ద కొన్ని ఇళ్లు తొలగింపునకు నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ముగ్గురు గల్లంతయ్యారు.. ఇద్దరు మృతిచెందారు. అన్ని సమస్యల పరిష్కారానికీ హైడ్రా కృషి చేస్తుందని తెలిపారు. అప్జల్సాగర్ డ్రైనేజీలో ఇద్దరు గల్లంతైన ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రకటించారు. గల్లంతైనవారి ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. కొన్ని నాలాలపై నిర్మాణాలు ఉన్నాయి.. వాటితో అందరికీ ప్రమాదమేనని హెచ్చరించారు. అప్జల్సాగర్ పరిధిలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఆమె తెలిపారు. హైదరాబాద్ ఆదివారం రాత్రి భారీ వర్షాలతో వణికిపోయింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వాన కారణంగా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ఫ్లాష్ప్లడ్స్ కారణంగా రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆసిఫ్నగర్లోని మాంగర్బస్తీ ప్రాంతం అతలాకుతలమైంది. వరద నీటికి ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే రంగంలోకి దిగారు. మాంగర్బస్తీ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి పరిస్థితిని సక్షించారు. ప్రజలకు జరిగిన ఇబ్బందులను తెలుసుకొని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్టు- వెల్లడించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్బస్తీ మాత్రమే కాదు, హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి కబ్జాలు ఉండటం వల్లే ఫ్లాష్ప్లడ్స్ రూపంలో విపత్తులు సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. మాంగర్బస్తీ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని అన్నారు. హైదరాబాద్లో హైడ్రా వ్యవస్థ ప్రాధాన్యత ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతోందని రంగనాథ్ వివరించారు. అంతేకాదు, ఈ మోడల్ను చూసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల్ల్రోకూడా హైడ్రా తరహా వ్యవస్థ అవసరమన్న డిమాండ్ వస్తోందని తెలిపారు. మాంగర్బస్తీ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో 145 ఇళ్లు నాలాపైనే నిర్మించబడ్డాయని తెలిపారు. స్థానికులు ముందుకొస్తే, వారికి ప్రభుత్వ పథకంలో అందించే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామని హా ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపై స్పందిస్తూ, మాంగర్బస్తీ సమస్యకు వారంరోజుల్లో పరిష్కారం చూపుతామని చెప్పారు. నాలాకు అడ్డుగా ఉన్న నాలుగైదు ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. అయితే, అన్ని ఇళ్లను తొలగిస్తారని భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల ఇళ్లను కూల్చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. మాంగర్బస్తీ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. నాలాల కబ్జాలు, అనధికార నిర్మాణాలు, వర్షాకాలంలో పునరావృతమయ్యే వరద సమస్యలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులు తేల్చుకున్నారు. వచ్చే వారాల్లో స్పష్టమైన చర్యలు అమలులోకి వస్తాయని, ప్రజలు నమ్మకంగా ఉండాలని సూచించారు.
———————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




