– వికారాబాద్ సభలో రాజ్యసభ ప్రస్తావన
– సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక
– సింఘ్విని తమిళనాడు నుంచి పంపాలని సూచన
వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి2: రాజ్యసభ నామినేషన్లకు మరో రెండు రోజుల గడువే ఉంది. ఈ రెండు స్థానాలను బలంరీత్యా కాంగ్రెస్ గెచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతల మధ్య సోమవారం కీలక చర్చ జరిగిందని సమాచారం. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలకు పార్టీ అగ్రనేతలు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని బలమైన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై చర్చ జరిగింది. ఎంపీల రేసులో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లను వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీని తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపేందుకు తెలంగాణ నేతలు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 18న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవులు ఏప్రిల్ 9తో ముగియనున్నాయి. నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ ఈనెల 5 కావడంతో ఎంపిక త్వరగా చేయాలని ఒత్తిడి పెంచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.