– రాష్ట్ర కార్యవర్గంలో కిషన్ రెడ్డి అనుచరులు
– పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ తనకే
– ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదన్న రాజాసింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 10: బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలో నా మనిషి, నీ మనిషి అనే రాజకీయం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కొత్త కమిటీలో 12 మంది ఒకే పార్లమెంటు సెగ్మెంట్ వాళ్లు ఉన్నారని చెప్పారు రాజాసింగ్. రాష్ట్ర కమిటీని కిషన్ రెడ్డి వేశారా? లేక రామచందర్ రావు వేశారా అని ప్రశ్నించారు. రామచందర్ రావు మంచి వ్యక్తే కానీ రబ్బర్ స్టాంప్ అని అన్నారు. ఈ ప్లానింగ్ అంతా కిషన్ రెడ్డిదేనని విమర్శించారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానన్నారు. కిషన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. నేనూ చేస్తా.. ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని సవాల్ విసిరారు. రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అని, తన వెనుక ఎవరూ లేరని అన్నారు. రాజీనామా చేయనని.. ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చే పార్టీని పండబెట్టారని వ్యాఖ్యానించారు. ఇపుడు ఏ కార్యకర్త పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు. తనపై పోస్టులు పెట్టిన వ్యక్తి ఎక్కడుంటాడో చూసుకోవాలని హితవు పలికారు. తన గురించి విమర్శించే వాళ్లు తమ గురించి ఆలోచించుకోవాలని సూచించారు. తనపై విమర్శలు చేసే అర్హత ప్రధాన కార్యదర్శి అశోక్కు లేదన్నారు. గతంలో ఏబీవీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన చరిత్ర ఆయనదని చెప్పారు. నెలకు డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల గొంతుకగా తాను మాట్లాడుతున్నానని చెప్పారు. నాకు బీజేపీ ఎలాంటి సహకారాలు అందించలేదు.. పార్టీలో నేను ఎలాంటి పదవి ఆశించలేదు.. ఇప్పుడున్న కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు.. ఈ కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. పార్టీని నాశనం చేస్తున్నదెవరో మరోసారి చెబుతా.. దిల్లీ పెద్దలు నాకు తరచూ ఫోన్ చేసి మాట్లాడతారు.. నాకు ఎప్పటినుంచో కేంద్రంలోని పెద్దల ఆశీర్వాదం ఉంది.. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతా.. నేను ఎప్పటికీ బీజేపీ నేతనే.. సెక్యులర్ వాదిని కాదు అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరను అని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారు. నేను చేసే కామెంట్స్ పార్టీపై కాదు.. కొందరు నేతలపై మాత్రమే. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అని రాజాసింగ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





