– డ్రగ్స్ వాడిన డిజెల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి1: భాగ్యనగరంలో డ్రగ్స్ వినియోగంపై ఈగల్ టీమ్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించారు.సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు డీజేలు డ్రగ్స్ తీసుకొని మ్యూజిక్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వొచ్చాయి.బఫెలో వైల్డ్ వింగ్స్, షెర్లాక్ ఇల్యూషన్, వేవ్ పబ్లలో పనిచేస్తున్న డీజేలు డ్రగ్స్ ప్రభావంలో మ్యూజిక్ నిర్వహిస్తున్నారని అధికారులు నిర్దారించారు. ఈ ఘటనలో శ్రీధర్, డేవిడ్, తన్వీర్ సింగ్, మణిభూషణం, రవికృష్ణ అనే ఐదుగురు డీజేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్బుల్లో యువతను ఆకర్షించే విధంగా డీజేలు డ్రగ్స్ వినియోగిస్తూ మ్యూజిక్ ప్లే చేస్తున్నారని తెలిపారు. పబ్బుల సంస్క•తిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భాగ్యనగరంలో డ్రగ్స్ రహిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తమ సోదాలు కొనసాగుతాయని ఈగల్ అధికారులు స్పష్టం చేశారు. పబ్బుల నిర్వాహకుల పాత్రపై కూడా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో నగరంలోని పబ్లపై అధికారులు మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.