– పిల్ను తిరస్కరించిన సుప్రీమ్ ధర్మాసనం
– ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆదేశం
న్యూదిల్లీ, అక్టోబర్ 13: రాహుల్ చేసిన వోట్ చోరీ వ్యాఖ్యలపై సిట్ విచారణ కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాహుల్ ఆరోపణలపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిల్ను విచారించేందుకు నిరాకరించింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని తేల్చిచెప్పింది. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి దేశంలో వోట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన వోట్లతో ఏర్పడిందంటూ విమర్శించారు. ప్రధానమంత్రి కూడా వోట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల వోటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఘాటు విమర్శలు చేశారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదేవిధంగా వోట్లు దొంగలించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో వోట్లు చోరీ చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని.. బిహార్లో మాత్రం బీజేపీ, ఈసీని ఒక్క వోటు కూడా చోరీ చేయనివ్వబోమని వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ చేసిన ఆరోపణలు బీజేపీ నేతలు, ఎన్నికల కమిషన్ అధికారులు ఖండించారు. తాజాగా దీనిపై పిల్ వేయగా సుప్రీం తిరస్కరించింది. ఎన్నికల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల పలు సందర్భాల్లో ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల జాబితా సన్నాహకాలు, నిర్వహణ, పబ్లికేషన్ విషయాల్లో ఈసీ పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును ఆయన కోరారు. అర్ధవంతమైన వెరిఫికేషన్, ఆడిట్, పబ్లిక్ స్క్రూటినీకి వీలుగా మెషీన్-రీడబుల్ ఫార్మెట్లో ఎన్నికల జాబితాను పబ్లిష్ చేయాలని కూడా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




