లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

‌- బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు
– దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి
– తాము అధికారంలోకి వొచ్చాక దేనినీ వొదలం
– అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం
– కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌

‌న్యూదిల్లీ, ఆగస్ట్ 2:  ‌మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ‌జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన వార్షిక న్యాయ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత దేశంలో ఎన్నికల సంఘం న్యాయ సమ్మతంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్‌ ‌చేయవద్దు అని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ‌జరిగిందని రాహుల్‌ ‌తెలిపారు. ఆ రిగ్గింగ్‌కు చెందిన డేటా, డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయన్నారు. దీన్ని మేం నిరూపిస్తామని, ఆ డేటా ఇప్పుడు ఉందని రాహుల్‌ ‌పేర్కొన్నారు.
ఓ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అధ్యయనాన్ని ఆయన వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో ఉన్న 6.5 లక్షల వోటర్లలో 1.5 లక్షల వోట్లు నకిలీ అని పేర్కొన్నారు. అలా ఫ్రాడ్‌ ‌చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 15 లేదా 20 సీట్లు తగ్గి ఉంటే, అప్పుడు మోదీ ప్రధాని అయ్యేవారు కాదని రాహుల్‌ అన్నారు. ఇండియాలో ఎన్నికల సంఘం చచ్చిపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్క సీటు గెలవలేదని, నాకు ఆశ్చర్యం వేసిందని, ఎప్పుడైనా ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతున్నారని రాహుల్‌ అన్నారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ మార్పు కనిపించిందని, లోక్‌సభకు.. విధానసభకు ఎన్నికల జరిగిన సమయంలో కొత్తగా కోటి వోటర్లు జత కలిశారని, దాంట్లో ఎక్కువ శాతం వోట్లు బీజేపీకి వెళ్లాయని, అందుకే తన వద్ద ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాని రాహుల్‌ ‌పేర్కొన్నారు.ఈ క్రమంలో మరోమారు  భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ‌రాహుల్‌ ‌గాంధీమరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. బీజేపీకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం వోట్ల దొంగతనంలో పాలుపంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయని రాహుల్‌ అన్నారు.ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తాము ప్రజల ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు. తాము బయటపెట్టే నిజంతో ఈసీ పునాదులు కదిలిపోతాయన్నారు. వోట్ల కుంభకోణంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్‌ అధికారులు పదవీవిరమణ చేసినా కూడా వారిని వదలమని హెచ్చరించారు. బీజేపీ కోసం ఈసీ వోట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. దాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. కాగా ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలేనని.. రాహుల్‌ ‌లాంటి వారు చేస్తోన్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *