– రేవంత్ అంచనాలకు మించి రాణించారు
– సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ
న్యూదిల్లీ,జూలై24: కులగణన సర్వే నిర్వహించడం అంత తేలిక కాదని తెలంగాణలో రేవంత్ రెడ్డి విజయవంతంగా కులగణన చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై దిల్లీలో ప్రజెంటేషన్ నిర్వహించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేపై ఇచ్చిన ప్రజెంటేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఒబిసి రిజర్వేషన్ల వ్యవహారం, రాష్ట్రం ఆమోదించి పంపించిన బిల్లుపై ఈ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆఫీసు రూముల్లో కూర్చొని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారు. దేశంలో నిర్వహించే కులగణనకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది. సరైన డేటా చేతిలో ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు తెలంగాణ చేతిలో సరైన డేటా ఉంది. వీధిస్థాయి వరకూ డేటా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇండియాలో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదు. ధనం, భూమి ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలిపే డేటా తెలంగాణలో ఉంది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా బిజెపి భావజాలం. కులగణనను సరైన రీతిలో బిజెపి సర్కారు చేయదు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి బిజెపి ఇష్టపడదని రాహుల్ అన్నారు. సమాజాన్ని వేగంగా డెవలప్ చేసే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశానికి ఇంగ్లీషు విద్య ఇప్పుడుచాలా అవసరం.. దళిత, ఆదివాసీ పిల్లలు ఇంగ్లీషులో చదవాల్సిన టైం వచ్చిందన్నారు. ఇంగ్లీషు తోపాటు ప్రాంతీయ భాషలు కూడా ముఖ్యమే అన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ నేతలు ఇంగ్లీషు వద్దంటున్నారు.. వారి పిల్లలు ఏం డియంలో చదువుతున్నారో నిలదీయాలన్నారు రాహుల్ గాంధీ. వెనకబడిన వర్గాల పిల్లలు ఇంగ్లీషు చదవకూడదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కులగణన చాలా స్పూర్తిదాయకంగా నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉంది.. కుల గణన నిర్వహణకు ఓ మార్గదర్శకం అన్నారు. కులగణన సక్సెస్ లో నిపుణుల కమిటీ పాత్ర అద్భుతం అన్నారు. సరైన డేటా మన చేతిలో ఉంటే ఏదైనా చేయగలం.. ఇప్పుడు తెలంగాణ చేతిలో సంపూర్ణమైన డేటా ఉంది..తెలంగాణ అభివృద్దికి ఇది ఎంతో తోడ్పడుతుందన్నారు రాహుల్. కులగణన నిర్వహించడం బీజేపీ సర్కర్ ఇష్టపడదు.. దేశ ముఖచిత్రాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ ఇష్టపడదన్నారు.





