– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సి.ఎస్. సంజయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవి, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక అయిదు దశల్లో జరుగుతుందని తెలిపారు. ప్రభత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమ నిర్వహణపై ఉమ్మడి జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రితో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి జిల్లాలోని ప్రముఖ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. ఈనెల 12న ఆయా జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందుకుగాను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయని అన్నారు. ఈ 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించ నున్నట్లు మరోసారి తెలిపారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




