నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మహబూబ్ నగర్ ప్రజాతంత్ర మే 30 : ప్రభుత్వం అమలు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం ప్రకారం పైలెట్ మండలంలో వొచ్చిన దరఖాస్తులు భూ భారతి పోర్టల్ ద్వారా పరిష్కరించాలన్నారు.మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలలో వ్యవసాయ కార్యచరణ, వడ్ల కొనుగోలు, అంటువ్యాధులు, భూభారత్ రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి దామోదర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబే దుల్లా కొత్వాల్, కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల్లో వానాకాలం సీజన్ కు పంటల సాగు ప్రణాళిక, విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఆయన సమీక్షించారు. అప్పట్లో ఇండ్ల స్థలాలు మనమే ఇచ్చామని, ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నామని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. అయితే మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకుంటే యజమాని బాధ్యతే అన్నారు. బేస్ మెంట్, లెంటల్ లెవెల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
అయితే జిల్లా శాసన సభ్యుల కోరినట్లు గ్రామ సభల్లో ప్రకటించిన అర్హుల జాబితా ప్రకారం ఇండ్లు మంజూరు చేసే విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. జిల్లాలో దేవాదాయ, వక్ఫ్, శిఖం, అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయన్నే వివరాలను కలెక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసంపై రెండు రోజుల్లో జరిగే క్యాబినెట్ మీటింగ్ లో చర్చిస్తామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,గతేడాది వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త ల పై ముందస్తు కార్యాచరణ ను సిద్ధం చేయాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. గతేడాది మహబూబ్ నగర్ జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదు అయ్యాయని, ఈ సారి అలా జరగకుండా ముందస్తుగానే వార్డుల వారీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి మంత్రికి తెలిపారు. నారాయణపేట జిల్లాలోనూ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ లలో ఫాగింగ్ యంత్రాలు లేవని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సీజన్ ఈ సారి ముందే ప్రారంభం అయిందని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల అధికారులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను మంత్రి వివరించారు. జూన్ మొదటి,లేదా రెండో వారంలో వైద్య ఆరోగ్యశాఖపై నారాయణపేట, మహబూబ్ నగర్ లలో ప్రత్యేక సమీక్ష చేస్తానని తెలిపారు.
కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించే రిపోర్ట్ లను ఆయా జిల్లాల శాసన సభ్యులకు కూడా పంపించాలని మంత్రి సూచించారు. నారాయణపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను మహబూబ్ నగర్ నుంచి అంబులెన్స్ డ్రైవర్లు హైదరాబాద్ లోని వెల్ నెస్ సెంటర్ కు తీసుకువెళ్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ కు నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యే లు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి అంబులెన్స్ డ్రైవర్ల వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా అధికారులు పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులను రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని సూచించారు. వాటితో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను ప్రతీ నెల తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎం. ఆర్. ఐ , త్వరలో ఏర్పాటు చేయిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే సి.టి.స్కాన్ కూడా ఏర్పాటు చేస్తామని, అలాగే జాతీయ రహదారి పై ప్రతి 35 కిలో మీటర్ల కు ఒకటి చొప్పున ట్రామా సెంటర్, మహబూబ్ నగర్ లో రీజియనల్ క్యాన్సర్ సెంటర్ ను, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల ను టాస్క్ పోర్స్ టీమ్ లు తనిఖీ లు నిర్వహించి కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మన ప్రభుత్వం వచ్చాకే వరి కి బోనస్ ఇస్తున్నామని, ఆ క్రెడిట్ మన ప్రభుత్వానికే దక్కాలన్నారు.
నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎంత మంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సి.ఎం.అర్ బకాయి లు ఉన్నారని జూపల్లి అధికారులను ప్రశ్నించారు.మహబూబ్ నగర్ లో 2023-24కు సంబంధించి ఒక మిల్లర్ 3.7 కోట్ల బకాయిలు ఉన్నారని, నారాయణపేట లో 10 రైస్ మిల్లర్ల నుంచి 2019-20 నుంచి ఇప్పటిదాకా 53 కోట్ల బకాయి ఉన్నారని అధికారులు తెలపగా, వారి నుంచి కలెక్టర్ లు రికవరీ చేయాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. . వరి ధాన్యం కొనుగోలు లో తరుగు లేకుండా చూడాలన్నారు. ఈ విషయంపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ. నియోజకవర్గాల వారీగా ఈ యాసంగిలో ఎంత మంది రైతులతో ఎంత ధాన్యం కొనుగోలు చేశాం, ఎంత మంది రైతులకు బోనస్ వచ్చిందనే వివరాలను,పంట నష్టం ఎంత జరిగింది,నష్ట పరిహారం వచ్చిన వివరాలను, వరి సేకరణ నియోజకవర్గం వారీగా వివరాలు ఎమ్మెల్యే లకు పంపించేలా చూడాలని మంత్రులను కోరారు. అలాగే జిల్లాల లో నకిలీ విత్తనాలపై ఎన్ని కేసులు నమోదు చేశారు.ఎన్ని కేసులు నమోదు చేశారని అడిగి తెలుసుకున్నారు. పైలెట్ మండలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ?ఎటువంటి భూ సమస్యలు ఉన్నాయి.? భూ భారతి చట్టం ప్రకారం తహశీల్దార్,అర్.డి. ఓ,అదనపు కలెక్టర్ తమ దగ్గరకు వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత సమయం లోగా పరిష్కారం చేయాలన్నారు.
ప్రభుత్వ భూములు,అన్యాక్రాంతం భూములు వివరాలు సమాచారం అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ,వాట్సాప్ నెంబర్ ప్రజలకు తెలుపాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు కలెక్టర్లకు సూచించారు. అయితే సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చైర్మన్ గా ప్రభుత్వ భూముల పంపిణీ కి ఒక అసైన్డ్ కమిటీ ఉండేదని, మళ్ళీ ఆ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు. కోయిల కొండ లో ఉన్న సీ హెచ్ సి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బేస్ మెంట్ వేసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింప చేయాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కోరారు. గండిడ్ మండలంలో బీపీ, షుగర్ మాత్రలను పంపిణీ చేయడం లేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, ముడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





