సంతాపం తెలుపుతూ ఎక్స్లో పోస్ట్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్12: పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో పోస్టు చేశారు. లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారు.
ఆయన అవిశ్రాంత కృషి.. ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్ తరాలపట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి.. యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు.




