“సింగిల్ విండో సొల్యూషన్”గా ప్రెస్ సేవా పోర్టల్

పీఆర్‌జీఐ యోగేష్ బవేజా

హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 18: ప్రెస్ సేవా పోర్టల్‌ (Press Seva Portal) ను సింగిల్ విండో సొల్యూషన్‌గా ప్రవేశపెట్టామ‌ని, ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని, అనుమతులు వేగవంతం అవుతాయని, ప్రచురణకర్తలకు మరింత సౌలభ్యం లభిస్తుందని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ) శ్రీ యోగేష్ బవేజా  అన్నారు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (PIB), హైదరాబాద్‌ ఆధ్వర్యంలో సీజీఓ టవర్స్, కవాడిగూడ, హైదరాబాద్‌లో ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘వార్తలాప్’ పేరుతో సోమ‌వారం నిర్వ‌హించిన  ఒక రోజు వర్క్‌షాప్ లో ఆయ‌న పాల్గొన్నారు .

ఈ సందర్భంగా  పీఐబి హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్,  మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారి ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్‌ నిర్వహించామని, ఇది ప్రచురణకర్తలకు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. పీఆర్‌జీఐ సహకారంతో, త్వరలో ప్రచురణకర్తల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆమె వెల్లడించారు.  డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ అశుతోష్ మొహ్లే మాట్లాడుతూ  కొత్త చట్టంపై ప్రజెంటేషన్ ద్వారా ప్రచురణకర్తలకు అవగాహన కల్పించారు. 2024 మార్చి నుంచి రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతోందని, 60 రోజుల్లోగా స్పందన రాకపోతే దరఖాస్తులు డీమ్డ్ అప్రూవ్ గా పరిగణించబడతాయని ఆయన తెలిపారు. ప్రచురణకర్తలు ఏజెంట్ల సహాయం తీసుకోకుండా నేరుగా పీఆర్‌జీఐ పోర్టల్‌ వాడాలని ఆయన సూచించారు.

గౌరవ్ శర్మ, ఎన్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రెస్ సేవా పోర్టల్‌ గురించి లైవ్ డెమో ద్వారా వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రచురణకర్తలు ఈ వర్క్ షాప్ లో చురుకుగా పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఐబి అధికారులు డాక్టర్ మానస్ కృష్ణ కాంత్, డిప్యూటీ డైరెక్టర్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్లు  గాయత్రి,  శివచరణ్ రెడ్డి, అలాగే ఐఅండ్‌పీఆర్‌ అధికారులు, రెండు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రచురణకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *