– కూసుమంచిలో కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం/ కూసుమంచి,ఆగస్ట్ 29, ప్రజాతంత్ర : ప్రమాదాల నివారణ కొరకు కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి (80) మంది లబ్ధిదారులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు పూర్తి స్థాయిలో కాటమయ్య రక్షక కిట్లను అందించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల, కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈత చెట్లు ఎక్కే సమయంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సాంకేతికంగా, శాస్త్రీయంగా కాటమయ్య రక్షక కిట్లను తయారుచేశారన్నారు. రాబోయే రోజులలో ప్రతి ఒక్క అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. గీత కార్మికుల సమస్యల తొలగించేందుకు ప్రభుత్వం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 80 మంది గౌడ సోదరులకు కాటమయ్య రక్షక కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన కాటమయ్య రక్షక కిట్లు కల్లు గీత కార్మికులు పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రమాదాల నుంచి బయటపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, కూసుమంచి మండల తహసీల్దార్ రవి కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



