– కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రెండో విడతలో భాగంగా చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాలలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తిమ్మాపూర్ పంచాయతీలోని జోగయ్యపల్లి, రామకృష్ణ కాలనీ, చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అప్పటివరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య , పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. క్యూలైన్లు పోలింగ్ కేంద్రాలలోకి కాక కేంద్రం బయటే ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ గురించి బి.ఎల్.ఓలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తపరచాలని ఆదేశించారు.
ఐదు మండలాలలో 86.58 శాతం పోలింగ్ నమోదు
జిల్లాలోని ఐదు మండలాలలో రెండవ విడత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 11 గ్రామపంచాయతీలలో 1,85003 ఓట్లకు గాను 1,60184 ఓట్లు పోలు కాగా ఐదు మండలాల్లో మొత్తం కలిపి 86.58 శాతంగా పోలింగ్ నమోదయింది.




