– మల్గి గ్రామంలో రసాయన పరిశ్రమపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
– ప్రజలకు అవగాహన కలిగిస్తున్న టీపీజేఏసీ
– ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పోలీసుల హెచ్చరికలు
– కార్యకర్తలు, గ్రామస్థులపై ఎటువంటి ఆంక్షలు వద్దు
– టీపీజేఏసీ ముఖ్యమంత్రికి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: మల్గి గ్రామంలో ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్, రెసిన్ తయారీ పరిశ్రమకు సంబంధించి శనివారం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్న నేపథ్యంలో పోలీసుల బెదిరింపులు మరియు పరిపాలనా జోక్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు ప్రజాసంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు, వ్యవసాయం, ప్రజల జీవనోపాధులు మరియు ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు పడే అవకాశం ఉందని మల్గి, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) సభ్యులు, శాస్త్రవేత్తలు మరియు సామాజిక కార్యకర్తలతో కలిసి, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని కరపత్రాలు, గ్రామ స్థాయి సమావేశాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రభావిత గ్రామస్తుల అభ్యర్థన మేరకే చేపట్టినవని సంఘాలు స్పష్టం చేశాయి. అయితే గ్రామాలకు వెళ్లవద్దని, అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని టీపీజేఏసీ జిల్లా కన్వీనర్ , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వై.అశోక్ కుమార్ ను జహీరాబాద్ డీఎస్పీ హెచ్చరించినట్లు కార్యకర్తలు ఆరోపించారు. ఇది పౌర సమాజ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నంగా, శాంతియుతంగా మరియు చట్టబద్ధంగా జరుగుతున్న ప్రజా పాల్గొనదలుచుకున్న చర్యలను అడ్డుకునే చర్యగా వారు అభివర్ణించారు. కేవలం పైనుంచి వచ్చిన వత్తిడితోనే ఈ విధంగా హెచ్చరించి వుండవచ్చునని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి గ్రామస్తులు, కార్యకర్తలపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా చూడాలని, జిల్లా సివిల్ మరియు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తమ వినతి పత్రంలో వారు కోరారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లే కార్యకర్తలపై ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లేదా ఇతర బలవంతపు చర్యలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయ వాతావరణాన్ని సృష్టించడం లేదా ప్రజల పాల్గొనడాన్ని పరిమితం చేయడం పర్యావరణ పరిపాలనతోపాటు ప్రజాకేంద్రీత పాలన సూత్రాలను దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇటీవలి స్థానిక పత్రికా కథనాలు కూడా ఈ ప్రతిపాదిత పరిశ్రమపై ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. కాలుష్య ప్రమాదాలు, రసాయన ప్రమాదాలు, రాష్ట్రాల మధ్య పర్యావరణ ప్రభావాలు, తగిన అత్యవసర సేవలు, వైద్య మౌలిక వసతుల లేమి వంటి అంశాలపై గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణను న్యాయంగా, పారదర్శకంగా, భయరహితంగా నిర్వహించాలని కోరుతూ ఈ ప్రాతినిధ్యానికి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ), నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (ఎన్ ఏపీఎం) – తెలంగాణ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్, హ్యూమన్ రైట్స్ ఫోరం, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్), నేషనల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ (ఎన్ ఏసీఈజే) – తెలంగాణ, దళిత్ బహుజన్ ఫ్రంట్, అక్షరం, అలీఫా, వాయిస్ ఆఫ్ ది పీపుల్ వంటి ప్రజాసంఘాలు, పౌర సమాజ సంస్థలు మద్దతు ప్రకటించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


