– నేపాల్లో ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. కొన్నేళ్లుగా పొరుగునున్న నేపాల్లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని భారత్కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వృద్దాప్యం కారణంగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి పదవిని గణపతి వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. మరో వైపు హైదరాబాద్లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట నలుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డితోపాటు నున్నె నరసింహారెడ్డిలు లొంగిపోయారు. ఇటీవల ఆసీఫాబాద్ అడవుల్లో ఎసఐబీ ఎదుట దేవ్జీతోపాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోయిన సంగతి తెలిసిందే. అదీకాక దేవ్జీతోపాటు పలువురు అగ్రనేతలు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలకు చేరుకున్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించిన విషయం విదితమే.2026, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిరచుకొంది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన పలు ఎన్కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. వేలాది మంది ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. పలువురు అరెస్టయ్యారు. భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు అగ్రనేతలు సైతం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసులకు చిక్కితే.. మావోయిస్టు పార్టీ చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉందనే ఒక చర్చ సాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





