– ఆల్మట్టి ఎత్తుపెంచితే రాష్ట్రానికి అన్యాయం
– కర్ణాటకను ఆపండి
– పెండింగ్లో వున్న సమస్యలు పరిష్కరించాలి
– కేంద్రానికి స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని.. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. దిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన ఉత్తమ్ కుమార్.. మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. ‘కొంత కాలం నుంచి జల్ శక్తి మినిస్ట్రీలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు అడిగాం. వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేటాయించాలని అడిగాం. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో సహా సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా ఉన్నారు. వారికీ కూడా ఇదే విషయాన్ని చెప్పాం. ఈ అంశం మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందని చెప్పాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మొదటి 45 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని ఈరోజు కూడా రెక్వెస్ట్ చేయడం జరిగింది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గోదావరి జలాల్లో సమ్కక్క-సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను సబ్మిట్ చేశాం. సీడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వారు అడిగిన వివరాలు ఇచ్చాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని క్లియరెన్స్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2) ఏపీ-తెలంగాణ మధ్య 811 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు డివైడ్ చేయాలి. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చొరవ చూపి.. జస్టిస్ బ్రిజేష్ను రిక్వెస్ట్ చేసి ఈ ప్రొసీడింగ్స్ను వేగవంతంగా ఫైనలైజేషన్ చేయించాలని కోరాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్నుఏపీ సబ్మిట్ చేస్తే ము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్ కేటాయించడానికి ఎవరికీ ఎటువంటి ఆస్కారం లేదనే విషయాన్ని అప్పుడు కూడా పాయింటవుట్ చేశాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి గోదావరి ఫ్లడ్ వాటర్ స్పేర్పై మరొకసారి కేంద్రానికి వస్తున్న సందర్భంగా.. దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పాం. స్పష్టంగా, లిఖితపూర్వకంగా కేంద్రమంత్రికి వివరించాం. ఈ ప్రాజెక్టు ఇల్లీగల్ అని స్పష్టంగా చెప్పాం. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రమంత్రికి తెలియజేశాం. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని చెప్పాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
‘ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఈ స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం కేబినేట్ తీర్మానం చేసి, జీవో ఇచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఇది చట్ట వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా కర్ణాటక ప్రభుత్వానికి చెప్పండని విజ్ఞప్తి చేశాం. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. తెలంగాణ అన్యాయం జరుగుతుంది. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పాం’ అని మంత్రి వివరించారు.
‘గత 22 నెలల నుంచి కేంద్ర ఫండింగ్ ఇరిగేషన్ కోసం అడిగాం. ఇప్పటివరకు ఫండింగ్ ఇచ్చిన ప్రాజెక్టులను మీరు పూర్తి చేయండని గతంలో నేను, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పారు. ఆ సూచన మేరకు దేవాదుల ప్రాజెక్టు మినహా.. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము కొన్ని ప్రాజెక్టులను లిస్టవుట్ చేశాం. వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించాలని కోరాం. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కృష్ణా నది నీటిని ఎవరూ ఎక్కువ డైవర్ట్ చేయొద్దు. దుర్వినియోగం చేయొద్దు. దీనిపై కేఆర్ఎంబీకి అధికారం ఇచ్చారు. అయితే గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, కేఆర్ఎంబీకి నిధులు ఇచ్చి టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్లలో కొంత ప్రొగ్రెస్ తీసుకొచ్చాం. ఫేజ్-1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్లు ఇన్స్టాల్ అయ్యాయి. ఫేజ్-2 కింద మరో 9 చేయాల్సి ఉంది. ఫేజ్-3 కింద 11 టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంది. ఫేజ్-2, ఫేజ్-3కి సంబంధించి కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేయాలని కోరాం. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత కృష్ణా నది నీటిని వాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తుందని చెప్పాం. అంతర్రాష్ట్ర వివాదాలు తగ్గుతాయని కేంద్ర మంత్రికి వివరించాం. వెంటనే స్పందించిన మంత్రి సీఆర్ పాటిల్ కేఆర్ఎంబీకి, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని చెప్పారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఉంది. 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే కేటాయించాలి. ట్రిబ్యునల్ కేటాయింపు కోసం చూడకుండా మైనర్ ఇరిగేషన్ కోసం 45 టీఎంసీల నీరు కేటాయించండి. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు టీఏసీ, ఐటీసీ అనుమతులు ఇవ్వాలి. తెలంగాణ-ఆంధ్రా మధ్య కృష్ణా నీటి పంపకాలు ట్రిబ్యునల్ ద్వారా త్వరగా పూర్తి చేయాలి. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి వరద జలాలు వినియోగం సాధ్యం కాదు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ ఛైర్మన్కి తెలిపాం. తెలంగాణ నీటిపారుదల రంగానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసే రాష్ట్రం. తెలంగాణ ప్రాజెక్టులకు పీఎంకేఎస్వై కింద 2026 – 2031 వరకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ ముందుకు రాకపోతే.. మేమే పూర్తి నిధులు వెచ్చిస్తామని కేంద్రమంత్రికి తెలిపారు. ఏపీ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వడం లేదు.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్, నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





