– పుష్కరాల సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం జరిగిన గోదావరి పుష్కరాలు-2027 కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైనచోట రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం ఎంతమేర నిధులు అవసరమో ఆర్థికపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బాసర, భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలే కాకుండా మధ్యలో ఉన్న ఇతర ప్రముఖ దేవాలయాలకు కూడా సౌకర్యవంతమైన రోడ్ల కనెక్టివిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించాలని మంత్రి తెలిపారు. ప్రధాన రహదారులతో దేవాలయాలను అనుసంధానం చేస్తూ ఒకేసారి సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాసర దేవాలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉన్నందున భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్ను కూడా ఈ కమిటీలో చర్చించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలన్నారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





