సంక్రాంతికి హైవేల‌పై ట్రాఫిక్ ఇబ్బందులు నివారించాలి

– గ‌త అనుభ‌వాల దృష్ట్యా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలి
– భారీ యంత్రాల‌తో ప‌నులు చేయొద్దు
– అధికార్ల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆదేశాలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంగ‌ళ‌వారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వహించారు. గతంలో ఎదురైన‌ ఇబ్బందులు ఈ సందర్భంగా చర్చించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  “హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువ ఉంటుంది.సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  ప్రత్యేక దృష్టి సారించారు. పోయినసారి ఎదురైన‌ అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల‌న్నారు. బుధ‌వారం  తూప్రాన్ పేట్,అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తా న‌న్నారు. ప్ర‌ధానంగా ఎల్బీనగర్ నుండి నస్థలిపురం,పనామా గోడౌన్,హయత్ నగర్,రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దు. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాల‌న్నారు. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలన్నారు. అన్ని రహదారి లేన్‌లు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపాలి. ఎక్కడా ట్రాఫిక్‌కు అయోమయం కలిగించే ఏర్పాట్లు ఉండకూడదన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలి. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ రేడియం జాకెట్లు (పసుపు / నారింజ రంగు) తప్పనిసరిగా ధరించాలి. రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్‌ల వద్ద తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్‌లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలి. అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాల‌న్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావుగా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలి. ముఖ్యమంత్రి ఈ ట్రాఫిక్ అంశంపై సీరియస్ గా ఉన్నారు. సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తాం. పండుగ పూట లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రభుత్వ ఆలోచన అని స్ప‌ష్టం చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంగ‌ళ‌వారం  లేఖ రాశాను.. అవసరమైతే ఒకటి,రెండు రోజుల్లో నేను స్వయంగా వెళ్ళి కలుస్తాన‌న్నారు. తప్పనిసరి ఐతే టోల్ ప్లాజాల వద్ద నామినల్ పేమెంట్ చేయడానికి ఆర్ అండ్ బి సిద్ధంగా ఉన్నదన్నారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాన‌న్నారు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవు..ఎలాంటి అసౌకర్యం ఉండదు. పండుగ ముందు మూడు రోజులు,తర్వాత మూడు రోజులు అన్ని విభాగాలు అలెర్ట్ గా ఉండాలి.ఈ రోజుల్లో హెవీ వెహికల్స్ రహదారిపై ప్రయాణం చేయకుండా చూడాలి. ప్రత్యేక కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలి. 108అంబులెన్స్ లు,మెడికల్ టీం లు,రెవెన్యూ,పోలీసు,ఆర్ అండ్ బి, ఎన్‌హెచ్ ఏఐ అలెర్ట్ గా ఉండాలి. తాను స్వయంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తాన‌న్నారు. చౌటుప్పల్, నార్కట్ పల్లి,కట్టంగూరు,పెద్దకాపర్తి,గుండ్రంపల్లి,టేకుమట్ల వద్ద ఉన్న ఇబ్బందులు అధిగమించాలి. ఆయా జిల్లా కలెక్టర్ల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రోడ్ ఎంక్రోచ్ మెంట్స్ వెంటనే తొలగించాలి. ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉంటే ఎన్‌హెచ్ ఏఐవాళ్లు వెంటనే పూర్తి చేయాలి. నేను రోడ్ మీద డ్యూటీలోనే ఉంటాను.అధికారులు అంతా డ్యూటీలోనే ఉంటూ ఈ సంక్రాంతికి ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు లక్ష్యంగా పనిచేద్దాం.” అని మంత్రి పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎన్‌హెచ్ ఏఐ రీజినల్ అధికారి శివ శంకర్, ఎంఓఆర్‌టీహెచ్ రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్,ఇంటెలిజెన్స్ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రఘు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు,ఆర్ అండ్ బి ఈ ఎన్సి లు జయభారతి,మోహన్ నాయక్,ఎస్.ఈ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *